నారూటే వేరు

ప్రతిఘటన
"మాది ఒంగోలు. నాటకాలతో నా రచనావ్యాసంగం మొదలైంది. అప్పట్లో పాతిక నాటకాల దాకా రాశాను. ఆంధ్రదేశమంతా తిరిగి వాటిని ప్రదర్శించేవాణ్ణి. అభ్యుదయ దర్శకుడు టి.కృష్ణతో పరిచయం కావడం వల్ల సినిమా జీవితం మొదలైంది. నా మొదటి సినిమా ఎ.వి.మురుగన్ తీసిన 'వాడని మల్లి'. ఆ తర్వాత 'దేశంలో దొంగలు పడ్డారు', 'ఎర్రమందారం', 'సగటుమనిషి' సినిమాలకు రాశాను. ఇవన్నీ ఒక ఎత్తయితే 'ప్రతిఘటన'కు డైలాగులు రాయడం మరో ఎత్తు. ఈ సినిమాకు డైలాగులు రాశాకే.. 'ఎవరీ హరనాథరావు?' అనే ఆసక్తి సినీలోకంలో మొదలైంది. గౌరవం పెరిగింది. వెంటవెంటనే విపరీతమైన అవకాశాలు వచ్చిపడ్డాయి. ఒక చిన్న సంఘటన ప్రేరణతో పుట్టిన కథ ఇది. ఒంగోలులో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాడు. అతనిది చాలా చిత్రమైన స్వభావం. ఒక రోజు రాముడు, మరొక రోజు కృష్ణుడి వేషం వేసుకుని ప్రచారం చేసేవాడు. సర్కస్ వాళ్లను బతిమాలి ఏనుగుల్ని, ఒంటెల్ని తీసుకొచ్చి వాటి మీద కూర్చుని ఊరేగేవాడు. తను గెలిస్తే 'సముద్రపు నీళ్లను మంచి నీళ్లుగా మార్చేస్తా'నని హామీ ఇచ్చేవాడు. అతని వాలకం చూసిన ఎలక్షన్ ఆఫీసరు.. అభ్యర్థి మెదడు సరిగా లేదని అభ్యర్థిత్వాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ సంఘటన ప్రేరణతోనే 'ప్రతిఘటన'కు మాటలు రాయడం మొదలుపెట్టాను. ఒక సీన్లో "మీరు మంచివాళ్లు అనుకుని జనాలు నిలబెడితే, గెలిచిన తర్వాత జనాలను పిచ్చివాళ్లను చేస్తున్నారు. ఈ సారి ఒక పిచ్చివాడికి అవకాశం ఇవ్వండి. జనాలను మంచివాళ్లను చేస్తాడు'' అని రాశాను.
మంచిదొంగ
అభ్యుదయ భావాలతో మాటలు రాస్తాననే భావన నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిన సినిమా 'మంచిదొంగ'. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం గొప్ప కదా! ఇందులో మోహన్బాబుకు రాసిన 'నా రూటే వేరు' డైలాగ్కు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. చిరంజీవికి రాసిన 'జంకుజమలస్కుటప' అనే ఊతపదం కూడా బాగా పేరుతెచ్చింది. వీటికేమీ అర్థం లేదు. పాత్ర స్వభావానికి సరిపడే పదబంధాలను సృష్టించడం.. అవి ప్రేక్షకుల నోళ్లలో కొన్నాళ్లు నానడం.. ఎక్కువమందికి నచ్చిందనడానికి నిదర్శనం. ఇదే సినిమాలో చిరంజీవి "దొంగాపోలీసు వైఫ్ అండ్ హజ్బెండ్లా ఉండాలి. ఎందుకంటే ఇద్దరూ కలిసేది రాత్రిపూటే కాబట్టి'' అంటారు. "కోహినూరు వజ్రం కాజేసింది ఒక దొంగ కాదు. ఒక సామ్రాజ్యం. అదే పని ఒక దొంగ చేస్తే వాడు బందిపోటు, దోపిడీదారుడు అంటారు'' అన్న డైలాగ్ అప్పట్లో చాలామంది మెప్పు పొందింది.
రాక్షసుడు
'రాక్షసుడు'లో నా వేషానికి నేనే డైలాగులు రాసుకునే అరుదైన అవకాశం చిక్కింది. ఆ ప్రతినాయక పాత్ర పేరు 'నరకాసురుడు'. కేవలం ఒకటిన్నర నిమిషం కనిపించే వేషం అది. ఏ వేడుకకు వెళ్లినా ఆ పాత్రను గుర్తు చేస్తుంటారు ప్రేక్షకులు. "అబ్బానీయబ్బా వెంకటసుబ్బా! పంతులమ్మ పెంచే పందెంకోడి ఇదేనట్రా. ఈకలు పీకతా! పంతులమ్మ ఉసిగొల్పిన పొట్లగిత్త ఇదేనట్రా. కొమ్ములు పెరకతా! కోటప్పకొండ దగ్గర దొప్పల చెరువుకాడ గొప్పల అప్పలకొండ నాకేం అవుతాడ్రా.. అబ్బా నీయబ్బా వెంకటసుబ్బా. యముకలుకొరకతా!!'' అన్న డైలాగ్ నాకు తెచ్చిన గుర్తింపు అంతాఇంతా కాదు. మద్రాసులో శతదినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు.. నేను వేదిక మీదికి వస్తుంటే.. ప్రేక్షకుల నుంచి విజిళ్లు, అరుపులు. విచిత్రం ఏమిటంటే కొన్నేళ్లపాటు రంగస్థల నటుడిగా ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినప్పటికీ నరకాసురుడు పాత్రకు వచ్చినంత పేరు రాలేదు. ఆ వేడుకలో బాలచందర్గారు ప్రత్యేకంగా నన్ను పిలిచి అభినందించడం మరపురాని అనుభవం.
ఇదా ప్రపంచం
నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా 'ఇదా ప్రపంచం'. ముత్యాలసుబ్బయ్య దాని దర్శకుడు. కథ, మాటలు నావి. రైల్వేస్టేషన్లో జరిగిన యదార్థగాథ ఇది. నాటకాలు వేస్తున్న రోజుల్లో విజయవాడకు వెళ్లినప్పుడు అనుకోని పరిస్థితుల్లో రైల్వేస్టేషన్లోనే పడుకోవాల్సి వచ్చింది. ఉన్నట్లుండి పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి రైలుపెట్టెల్లో గాలించడం మొదలుపెట్టారు. అప్పటికే ఏవో కేకలు వినిపిస్తున్నాయి. పోలీసులను చూసి అయిదుగురు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. తీరా వెళ్లి చూస్తే.. ఒక మతిస్థిమితం లేని మహిళపై వాళ్లు అత్యాచారం చేసినట్లు తేలింది. అది తెలిసాక ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అదే ఇతివృత్తంతో 'అరణ్యరోదన' అనే పేరు మీద కథ రాసి స్వాతి పత్రికకు పంపిస్తే అచ్చువేశారు. ఈ తర్వాత దాన్నే 'ఇదా ప్రపంచం' సినిమాగా తీశారు. నంది అవార్డుల స్క్రీనింగ్ కమిటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన డివిఎస్ రాజు పబ్లిక్గార్డెన్లో తారసపడి "హరనాథ్.. నీ సినిమా చూశానయ్యా! అందులో నువ్వు రాసిన ఒక్కో మాట నా గుండెల్ని తాకింది. అందుకే నంది అవార్డు ఇస్తున్నాము'' అన్నాడు.
సూత్రధారులు
ఈ సినిమాకు నేను డైలాగ్ రైటర్నని ప్రకటించాక.. "గొడ్డళ్లు పట్టే రాతలు రాసే హరనాథరావు.. సంప్రదాయవాది విశ్వనాథ్గారి సినిమాకు ఎలా రాయగలడు?'' అన్న కామెంట్లు వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావుగారితో తొలి, చివరి సినిమా అదే! ఆయనకు ఒక సన్నివేశంలో ఒకటిన్నర పేజీల డైలాగు రాయాల్సొచ్చింది. హింసకు, అహింసకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాల్సి వచ్చింది. "నోరున్న మనిషికి, ప్రాణమున్న మనిషికి, ఆలోచన ఉన్న మనిషికి.. నోరులేని, ప్రాణంలేని, ఆలోచనలేని గొడ్డలితో సమాధానం చెప్పాలని చూస్తున్నారు. పులిని బ్రాహ్మడు పెంచినా అది మాంసాన్నే కోరుకుంటుంది. ఒకడు దుర్మార్గం చేయడానికి కారణం మనం కాదా? గోదారికి పొంగు వచ్చినా, కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవడూ ఆపలేడు''. విలన్లో మానసిక పరివర్తన తెచ్చే మాటల సందర్భంలో వస్తుందీ డైలాగ్. ఎఎన్ఆర్ అంత గొప్ప నటుడికి నేను మాటలు అందించడం వినాయకుడికి అక్షరాభ్యాసం చేసినట్లు భావించాను.
రేపటిపౌరులు
'రేపటిపౌరులు'లో వ్యభిచారం చేస్తున్న మహిళను విచారణకు పిలిచే సన్నివేశం ఒకటుంది. అప్పటి వరకు శృంగార పాత్రలు వేసిన అనురాధ ఒక గొప్ప నటి అని నిరూపించుకునేందుకు నా డైలాగులు తోడ్పడ్డాయి. కోర్టు బోనులో నిలబడిన ఆమె బాధతో "ఈ ప్రపంచంలో జరిగే అవినీతిలో మా భాగం కొద్దే! ప్రతి రాత్రి పడుకునే దుప్పటి ఎన్నిసార్లు మార్చానో అన్నిసార్లు ఆలోచించాను. గదిలో దీపం ఎన్నిసార్లు ఆరిపోతుందో అన్నిసార్లు ఆలోచించాను. చీకట్లో మేం చేసే పాపాలకు బాధతో కన్నీళ్లు కారుస్తుంటే.. ఆ కన్నీళ్లను చేతులతో తడిమి అబ్బో నీకప్పుడే చెమటలు పుట్టించాను అనే నీచ నికృష్ట రసిక మగ జాతి ఉన్నంత కాలం.. మా శరీరాలను అమ్ముకోవాల్సిందే!'' అంటుంది. దర్శకుడు టి.కృష్ణకు నాకు మధ్య మంచి అవగాహన ఉంది. నా ఆలోచనా ధోరణి ఆయనకు తెలుసు. ఆయన ఆలోచనలు నాకు తెలుసు. భావాల జోడీ కుదరడం వల్ల మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అప్పట్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ కోవలో వచ్చిందే ఈ సినిమా.
ఎర్రమందారం
ఈ కథను కొన్నేళ్ల కిందట రాసుకున్నాను. దాన్ని బాలచందర్గారు కూడా ఇష్టపడ్డారు. అయితే ఈ కథను అప్పటికే రంజిత్కుమార్గారు తీసుకున్నారు. ఆ తర్వాత ఇరవై ఏళ్లకు రంజిత్గారి అనుమతితో సినిమా తీశారు. నాకు ఒక కోరిక ఉండేది - డైలాగులు తక్కువగా, దృశ్యం ఎక్కువగా ఉండాలీ అని. ఈ సినిమాతో ఆ కోరిక కొంత వరకు నెరవేరింది. నేను సృష్టించిన పాత్రకు రాజేంద్రప్రసాద్ న్యాయం చేశారు. ఇందులో మంచి మాటలు ఉన్నాయి. చేయని నేరానికి జైలుకు వెళతాడు హీరో. జైలు నుంచి తిరిగి వచ్చిన భర్తను బస్టాండులో కలుస్తుంది అతని భార్య. బస్టాండు నుంచి ఇంటికొచ్చే వరకు రాజేంద్రప్రసాద్ పాత్రకు మాటలు లేవు. అక్కడ అవసరం లేదనిపించింది. కాని భార్య అతను జైలుకు వెళ్లినప్పటి నుంచి జరిగిన సంఘటనలను చెపుతూనే ఉంటుంది. అతను మాత్రం మాట్లాడడు. తను నిరపరాధి. జైలుకు పంపించారన్నదే అతని ఆవేదన. తీవ్రమైన ఆవేదనలో ఉన్నప్పుడు మాటలు రావు. రెండు మూడు నిమిషాలు గడిచాక.. భర్త మౌనాన్ని భరించలేని భార్య - భోరున ఏడుస్తూ.. "నాలో నేనే మాట్లాడుకుంటుంటే అందరూ నన్ను పిచ్చిదాన్ని అంటారు..'' అంటుంది. అప్పటికీ అతను మౌనం వీడడు. అయితే భార్యను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు. ఇది నాకు నచ్చిన దృశ్యం. కెమెరా మాట్లాడలేనప్పుడే.. పాత్ర మాట్లాడాలి అన్నది నా ఫిలాసఫీ!
పుణ్యభూమి నా దేశం
హిందీ ఫిల్మ్కు రీమేక్ 'పుణ్యభూమి నా దేశం'. దర్శకుడు కోదండరామిరెడ్డి. హిందీ స్క్రిప్టును నా చేతుల్లో పెట్టి డైలాగులు రాయమన్నారు. అప్పుడు మోహన్బాబుగారితో నేను "సార్, హిందీలో మంచి డైలాగులే ఉన్నాయి. అయితే వాటిని యధాతథంగా రాయను. తెలుగులో వాటికంటే బాగా రాయడానికే ప్రయత్నిస్తాను. రెండింటిలో మీకు ఏవి నచ్చితే అవి పెట్టుకోండి'' అన్నాను నేను. నా క్రమశిక్షణను ప్రేమించే మనిషి ఆయన. కాదనకుండా ఒప్పుకున్నారు. డైలాగులు రాసి చదివి వినిపించాక.. ఆయనకు బాగా నచ్చాయి. సినిమాలో అవే వాడుకోవడం జరిగింది. ప్రేక్షకులకు సూటిగా స్పష్టంగా అర్థమయ్యే మాడ్యులేషన్లో మోహన్బాబు డైలాగులు చెబుతారు కాబట్టి.. క్లయిమాక్స్లో మంచి డైలాగులు రాసే అవకాశం దొరికింది. ఒక చోట "ఈ ప్రపంచంలో రెండే మతాలు. ఒకటి బతికున్న వాళ్ల మతం. రెండు చచ్చిన వాళ్ల మతం. నేను హిందువునని మా అమ్మ కడుపులో అరవై నెలలు, నువ్వు ముస్లింవని మీ అమ్మ కడుపులో డెభ్భై నెలలు ఉన్నామా? ఒక హిందువు ముస్లిం స్త్రీని పెళ్లాడితే మతం మారిందని పిల్లలు పుట్టరా? ఏ మతం చెప్పింది మతాల పేరుతో తన్నుకు చావమని. అదే నిజమైతే మందిరాలు, మసీదులు ప్రార్థనలు చేసే స్థలాలు కావు. దేవుణ్ణి పూడ్చిపెట్టే స్థలాలు..'' అనే డైలాగ్ ఉంది. నేను మాటకు రూపం ఇస్తే ఆయన ప్రాణం పోశారీ చిత్రంలో. మరొక డైలాగు-"బ్రిటిషు వాణ్ణి వెళ్లగొట్టడానికి ఈ దేశంలో కాలిన బస్సులకన్నా, తగలబడిన ఆఫీసులుకన్నా చచ్చిన మనుషులకన్నా 47 ఏళ్ల స్వాతంత్య్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం మనం తగలబెట్టుకున్నదే ఎక్కువ''. నేటి రాజకీయాలకు అతికినట్లు సరిపోయే మాటలు ఇవి.
యమ్ ధర్మరాజు ఎంఏ
ఈ సినిమా చూశాక 'ఆ డైలాగులు మా మీద రాశారంటే మా మీద రాశారు' అని కొందరు పొలిటీషియన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. రాజకీయ నాయకులు అనే వాళ్లు ప్రత్యేక జాతి కాదు. మనుషుల్లో ఉన్న జాతే! రాజకీయనేతల స్వభావాన్ని సినిమాటిక్గా చెప్పడంవల్ల పెద్దహిట్ అయ్యిందీ చిత్రం. అప్పటి వరకు హీరోగా చేస్తున్న మోహన్బాబు నెగటివ్షేడ్ కలిగిన పాత్రను చేయడం ఒక సాహసం. ఆద్యంతం ఆకట్టుకునే సంభాషణలు ఇందులో చాలానే ఉన్నాయి. ఒకే వేదిక మీద పోలీసుఅధికారి, రాజకీయనేత వేషం వేసిన మోహన్బాబు కూర్చుంటారు. నాటుసారా కాసే తన మనుషుల్ని అరెస్టు చేయడంతో.. విడుదల చేయమని అడుగుతాడు. అప్పుడు పోలీసుఅధికారితో మోహన్బాబు "బురదలో ఉన్న పంది జోలికి.. అధికారంలో ఉన్న నాయకుల జోలికి వెళ్లకూడదు'' అంటాడు. ఈ డైలాగు ఎంతమందికి నచ్చిందో చెప్పలేను.
"సామాన్య ప్రేక్షకులను సినిమాకు రప్పించాలంటే.. సహజసిద్ధమైన సంభాషణలు అవసరం. తొలినాళ్లలో వచ్చిన సాంఘిక చిత్రాలలో అలాంటి సంభాషణలే ఉండేవి. మధ్యలో మెలోడ్రామాలు పెరిగి - శబ్దం తప్ప అర్థం తక్కువైన మాటలు వచ్చాయి. అవి కూడా విజయవంతం అయినా ఇప్పుడు మళ్లీ మనం మొదటిదశకు వెళ్లి సహజమైన సంభాషణలు కావాలంటున్నాం. సహజత్వం లేనిది ఏదీ జీవితానికి దగ్గరగా ఉండదు అనేందుకు ఈ ట్రెండ్ నిదర్శనం''
"నాన్నా.. రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి. నువ్వు వెళ్లు'' అంటే "ఈ వెధవ చదువు ఎప్పుడూ ఉండేదే లేరా. నాటకం చూద్దువు గాని నాతోపాటు బయలుదేరు'' అని తండ్రి ఏ రోజైతే నాటకాల మీద ఆసక్తిని కలిగించారో ఆ రోజు నుంచి.. రంగస్థల వేదికనే జీవితంగా చేసుకున్న ఎంవిఎస్ హరనాథరావు.. పాతిక నాటకాలు రాసి ప్రసిద్ధి పొందారు. ఆతర్వాత మద్రాసు వెళ్లిపోయి సినిమాల్లో రైటర్గా కెరీర్ను ప్రారంభించారు. టి.కృష్ణ, పోకూరిబాబూరావు, కె.విశ్వనాథ్,రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, ముత్యాలసుబ్బయ్య, సురేష్కృష్ణ వంటి దర్శకులతో కలిసి పనిచేశారాయన. డైలాగులు రాసిన వంద సినిమాల్లో సగం సినిమాలు హిట్ అయ్యాయి. రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, అమ్మాయికాపురం, ఎర్రమందారం, భరతనారి, మంచిదొంగ, పుణ్యభూమి నా దేశం, పరువు ప్రతిష్ట, యమ్ ధర్మరాజు ఎంఎ, ఏవండీ ఆవిడ వచ్చింది, ధర్మచక్రం, అన్న, శ్రీమతీ వెళ్లొస్తా.. తదితర చిత్రాలకు రాసిన సంభాషణలు పేరు తెచ్చాయి. ఇప్పటి వరకు అయిదు సినిమాలకు ఉత్తమ డైలాగ్ రైటర్గా నంది అవార్డులు అందుకున్నారాయన.
"తాపీధర్మారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, చలం, సుంకరవాసిరెడ్డి, సముద్రాల, మల్లాది, ఆత్రేయ, ముళ్లపూడి, డివి నరసరాజు, జాన్సన్ వంటి ఎందరెందరో మహానుభావులు అద్భుతమైన మాటల సంపదను తెలుగు సినీ రచయితలకు అందించారు. ఆ పునాదుల మీదే తెలుగులో డైలాగ్ రైటింగ్ ఎదిగింది''
"నేటి మాటల రచయితల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాకు ఇష్టం. అతని డైలాగుల్లో సున్నితత్వంతోపాటు చక్కటి అర్థం ఉంటుంది. నిరాడంబరత కనిపిస్తుంది. అందుకే అందరికీ గుర్తుండిపోవడమే కాదు.. వేగంగా ప్రాచుర్యం పొందుతాయి''
- మల్లెంపూటి ఆ



